Select Page

మొండి మూత్రపిండాల వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు

మూత్రపిండాలు రోజుకు దాదాపు రెండు వందల లీటర్ల శుద్ధి చేయగలవు. ఆ నీరు 99.99 శాతం పరిశుద్ధమైనది. ఇంతటి సామర్థ్యంతో పనిచేసేవి అత్యాధునిక సాంకేతిక విజ్ణానం తాజాగా తయారుచేసిన వాటర్ ప్యూరిఫయర్ అన్న అభిప్రాయం కలగవచ్చు. కానీ ఈ అసాధారణ ఫిల్టర్లు మూడు వందల ఏభై కోట్ల సంవత్సరాల క్రితం రూపొంది  ప్రకృతి సిద్దంగా మనుషులందరికీ వారి శరీరాలలో అందుబాటులో ఉన్న మూత్రపిండాలు(కిడ్నీస్).  అవును మన శరీరంలో భాగంగా ఉన్న ఈ అవయవాల సామర్థ్యం అంతటిది. కిడ్నీస్ మనిషి శరీరం పనితీరును వేగంగా ప్రభావితం చేయగల అవయవాలలో మూత్రపిండాలు మొదటి శ్రేణిలో నిలుస్తాయి. శరీరంలోని రక్తాన్ని శుద్దిచేసి, అనవసర, ప్రమాదకర, విసర్జన పదార్థాలను నీటితో కలిపి బయటకు పంపించే విధిని నిర్వహిస్తుంటాయి. కానీ ఇవే కిడ్నీలకు  వ్యాధులు సోకినప్పుడు ఓ సాధారణ  వ్యక్తి  దేహంలో ఉండే 4.5 – 5.7  లీటర్ల రక్తాన్నే శుద్ధిచేయలేని స్థితికిచేరుకుంటాయి. వ్యక్తి తన మూత్రపిండాలతో సహా మూత్ర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను ప్రాధమిక దశలో  గుర్తించటంలో చాలా వరకు ఆలస్యం అవుతుంది.  వ్యాధులు ముదిరి క్రమంగా మూత్రవ్యవస్థ పనితీరు దెబ్బదింటుంది. కొంత మందిలో ఇది చివరకు రీలనల్ ఫెయిల్యూరుకు దారితీసి మూత్ర పిండాల మార్పిడి(కిడ్ని ట్రాన్స్ ప్లాంటేషన్) అవసరం అవుతుంది.

మూత్రపిండాలు చెడిపోవటానికి అనేక కారణాలను గుర్తించారు. వ్యాధులు, ఇతర పరిస్థితులు వల్ల  వాటికి నష్టం జరుగుతుంది. నష్టం తీవ్రస్థాయికి చేరుకుంటే కిడ్నీల సాధారణు  పనితీరు దెబ్బదింటుంది.  శరీరానికి సోకిన ఇతర దీర్ఘ వ్యాధులు, హఠాత్తుగా తలెత్తిన రుగ్మతల వల్ల ఇవి ప్రమాదం ఎదుర్కొంటాయి. ఈ పరిస్థితిలో డాక్టరును సంప్రదించగలిగితే ఆ వ్యాధులకు చికిత్స జరిగి మూత్రపిండాలు ప్రమాదం నుంచి బయటపడతాయి. వీటిని దెబ్బదీసే వ్యాధులలో మొట్టమొదటిది మధుమేహం(షుగర్ వ్యాధి). మధుమేహం టైప్-1, టైప్-2 రెండూ కూడా కిడ్నీస్ రెండూ నష్టపరచేవే. షుగర్ వ్యాధితోపాటు దీర్ఘకాలంపాటు కొనసాగే అధిక రక్తపోటు కూడా  ప్రమాదకరమైనదే.  మూత్రనాళాల ఇన్ ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయటం కూడా పరిస్థతిని దిగజారుస్తుంది. ఒక్కొక్కటి వయోజనుడైన వ్యక్తి పిడికిలి అంత ఉండే ఈ మూత్రపిండాలకు పెద్ద దెబతగిలినా, వ్యక్తి తీవ్రమైన మంటలలో చిక్కుకుని  శరీరం ఎక్కువ శాతం కాలినా వాటి పనిసామర్థ్యం దెబ్బదింటుంది. కిడ్నీ ఫెయిల్యూర్  కొన్ని కుటుంబాలలో  వంశపారంపర్యంగా వస్తున్నట్లు కూడా గుర్తించారు. 

Consult Our Experts Now

మూత్రపిండాలలో రాళ్లు:

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని నెఫ్రోలిథియాసిస్ లేదా  రీనల్ కాలిక్యులై అని కూడా అంటారు. మనదేశంలో ప్రస్తుతం దాదాపు పదిహేను కోట్ల మందిలో ఈ  వ్యాధి ఉన్నట్లు అంచనా. మూత్రపిండాలలో రాళ్లు ఎంత సాధారణం అంటే మనదేశ  జనాభాలోని ప్రతీ 1000 మందిలో 2 ఇద్దరు ఈ వ్యాధికి గురవుతున్నారు. రెండు సార్లకంటే ఎక్కువగా సమస్య ఎదురయినవారిలో ఇది మళ్లీ మళ్లీ  వస్తుంటుంది.  వీరిలో దాదాపు సగం మందిలో ఈ వ్యాధి కారణంగా మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకుం పోయే ప్రమాదం ఉంది.

 రీనల్ కాలిక్యులై  ఏర్పడటానికి  అనేక కారణాలను గుర్తించారు. పరిసరాల ప్రభావం, వంశపారం పర్యం, ఆహారపు అలవాట్లు ఈ వ్యాధికి దారితీస్తున్నాయి. కొన్ని పదార్థాలు చేరటం వల్ల మూత్రం చిక్కబడి స్పటికాలుగా మారతాయి. ఆ స్పటికాలే చివరకు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు మూత్రపిండాల నుంచి యురేటర్ లో  వచ్చితరువాతగానీ తీవ్రమైన నొప్పి ప్రారంభమై వ్యాధి లక్షణాలు కనిపించటం మొదలవుతుంది. ఈ రాళ్లు 5 మి.మీ.(అర సెంటీమీర్) లోపు పరిమాణంలో ఉంటే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అంతకంటే పెద్ద సైజులో ఉండి మూత్రనాళానికి అడ్డుపడుతున్నట్లయితే అది వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. వాటిని తొలగించటానికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడినపుడు స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. అవి: తీవ్రమైన వీపునొప్పి. ఈ నొప్పి కటివలయాని కూడా విస్తరిస్తుంది. పొట్టలో వికారంగా ఉండి వాంతులు చేసుకుంటారు.  పొట్టలో నొప్పి ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్రం అసాధారణమైన రంగులో ఉండి వాసనవేస్తుంది.  ముత్రవిసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం పడుతుంది. కొన్నిసార్లు చలి-వణుకుడు వంటి లక్షణాలతో జ్వరం వస్తుంది.

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం చాలా నొప్పిని కలిగించే మాట నిజమే. కానీ వాటిని తొలగించి వేయటం ద్వారా శాశ్వత నష్టం జరగకుండా కాపాడుకోవటానికి అవకాశం ఉంటుందని యశోద హాస్పిటల్స్ లోని నెఫ్రాలజీ విభాగానికి చెందిన వైద్యనిపుణులు చెప్పారు. మూత్రపిండాలలో రాళ్ల వ్యాధి చికిత్స దాని లక్షణాల(ప్రధానంగా నొప్పి) నుంచి ఉపశమనం కలిగించటంతో ప్రారంభించి భవిష్యత్తులో మళ్లీ ఆ పరిస్థితి ఏర్పడకుండా చూసే లక్ష్యంతో జరుగుతుంది. నొప్పి నుంచి ఉపశమనానికి మొదట పెయిన్ కిల్లర్స్ సిఫార్సుచేస్తారు. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవలసిందిగా సూచిస్తారు. తగినంత సమయం ఇచ్చినపుడు కొన్ని రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.కొన్నిరాళ్లను మందులు, ద్రవాలు ఇవ్వటం ద్వారా తొలగించటం సాధ్యం కాదు. అందుకు కారణం అవి బాగా పెద్దగా ఉండటం కానీ లేదా మూత్రం ద్వారా బయటకు వచ్చే క్రమంలో రక్తస్రావానికి కారణం కాగలవి ఉండటం కానీ కావచ్చు. ఆ  పరిస్థితిలో శస్త్రచికిత్స, లిథోట్రిప్సీ వంటి పత్యామ్నాయ మార్గాలు సిఫార్సుచేస్తారు. శస్త్రచికిత్స ద్వారా మూత్రపిండాలలోని  రాళ్లను వెలికి తీసేందుకు ఎండోస్కోపును ఉపయోగిస్తారు.  లిథోట్రిప్సీలో అల్ట్రాసౌండ్ తరంగాలను(ఎస్ట్రాకార్పోరల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ)  ఉపయోగించి మూత్రపిండాలలోని రాళ్లను పగుల గొడతారు. నలభై అయిదు నిముషాల నుంచి గంట వరకు సమయం పట్టే ఈ చికిత్సలో బలపైన శబ్దతరంగాలను ప్రయోగిస్తారు. స్థానికంగా పనిచేసే మత్తు మందు ఇచ్చి దీనిని పూర్తిచేస్తారు. పగిలి చిన్నవిగా అయిన ఆ రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయేందుకు వీలవుతుంది.

Consult Our Experts Now

గ్లోమెరూలోనెఫ్రైటిస్:

మూత్రపిండాలకు వచ్చే తీవ్రమైన వ్యాధుల్లో  గ్లోమెరూలోనెఫ్రైటిస్ ఒకటి. మూత్రపిండాలలో వడపోత బాధ్యతను నిర్వర్తించే గ్లోమెరూలి ఫిల్టర్లు వాపునకు గురికావంతో ఈ వ్యాధి ఏర్పడుతుంది.  గ్లోమెరూలోనెఫ్రైటిస్  వ్యాధి వచ్చినపుడు గ్రోమెరులేలు రక్తంలోని వ్యర్థపదార్థాలతోపాటుగా ఎలక్ట్రోలైటులు, అవసరమైన ఇతర ద్రవాలను కూడా తీసివేసి మూత్రంలోకి పంపించుతాయి.  గ్లోమెరూలోనెఫ్రైటిస్ ఒక్కసారిగా రావచ్చు లేదా నెమ్మదిగా ప్రారంభమైన దీర్ఘ వ్యాధిగా ఏర్పడవచ్చు. ఈ వ్యాధి విడిగా రావచ్చు. లేదా లూపస్, మధుమేహం(డయాబెటిస్) వంటి వ్యాధుల పర్యవసానంగా కూడా ఏర్పడవచ్చు. దీర్ఘకాలంపాటు  గ్లోమెరూలోనెఫ్రైటిస్ కొనసాగటం వల్ల మూత్రపిండాలు చెడిపోయి  పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి.

గ్లోమెరూలోనెఫ్రైటిస్ వ్యాధి లక్షణాలు కనిపించటం అన్నది అది తరుణ వ్యాధా లేక దీర్ఘవ్యాధిగా ఉందా, ఎందువల్ల వచ్చిందన్న అంశాలపైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జరిపే మూత్రపరీక్షలోనే ఏదో లోపం ఉన్నట్లు తెలిసి దీని మొదటి సూచిక కనబడుతుంది. ఆపైన మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవి: మూత్రం గులాబీ లేదా కోలా రంగులో ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్లు చేరటం వల్ల నురుగుగా ఏర్పడుతుంది. అధిక రక్తపోటు(హై బీపీ) ఎక్కువ అవుతుంది. ముఖం  కాళ్లూచేతులు, పొట్ట వాపునకు గురవుతాయి.

ఈ లక్షణాలు కనిపించినపుడు వెంటనే డాక్టరును కలవాలి. ఆలస్యం చేయటం వల్ల మూత్రపిండాలు హఠాత్తుగా విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధులు ఏర్పడి చివరకు కాన్సరుకు దారితీస్తాయి. రక్తపోటు విపరీతంగా పెరిగిపోయి హైబీపీ వ్యాధి వస్తుంది. శరీర కణాల నిర్మాణానికి ఉపయోగపడవలసిన ప్రోటీన్లు గ్లోమెరూలోల స్థిరడిపోవటం, ఎలక్ట్రోలైట్ల మూత్రంలో వెళ్లిపోవటం ఆరోగ్యాన్ని వేగంగా దిగజారుస్తుంది.

గ్లోమెరూలోనెఫ్రైటిస్ వ్యాధికి చికిత్స అది ఏ కారణం వల్ల వచ్చింది, దీర్ఘ వ్యాధిగా ఉందా లేక తరుణ వ్యాధా, వ్యాధి తీవ్రతల పై ఆధారపడి ఉంటుంది.వ్యాధి ప్రారంభదశలో ఉన్నప్పుడు,ఇన్ఫెక్షన్లు – హైబీపీ – షుగర్ తదితర వ్యాధుల కారణంగా ఏర్పడిపుడు మందులతో చికిత్సచేయటం – ఆయా వ్యాధులను కుదర్చటం ద్వారా చికిత్సచేస్తారు. మూత్రపిండాలకు మరింత నష్టం జరగకుండా నివారించే లక్ష్యంతో చికిత్స సాగుతుంది. వ్యాధి తీవ్రస్థాయికి చేరిన, మూత్రపిండాల విఫలమయ్యే స్థితిలో ఉన్నట్లయితే చికిత్స విధానం మారిపోతుంది. ఆస్థితిలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేయటం ఒక్కటే మార్గమనియశోద హాస్పిటల్స్ లోని నెఫ్రాలజీ విభాగానికి చెందిన వైద్యనిపుణులు చెప్పారు.

Consult Our Experts Now

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి:

సి.కె.డి. అంటే  క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇది తీవ్రమైన  మూత్రపిండాల వ్యాధి. శారీరక శ్రమ ఏమాత్రం లేని జీవనశైలి,  ఆహరపు అలవాట్లలో లోటుపాట్ల కారణంగా మనదేశంలో చాలా మందికి ఈ వ్యాధికి వస్తున్నది. డయాబెటిస్, హై బి.పి వ్యాధిగ్రస్థులో మూత్రపిండాల వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. రక్తపోటు అధికంగా ఉండటం, మధుమేహం రెండు ప్రధాన కారణాలు అయినప్పటికీ గ్లొమెర్యులార్ డిసీజ్, వారసత్వ(జన్యు) కారణాల వల్ల కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తున్నది. పదేపదే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షనుకు గురవుతుండటం, మూత్రపిండాలలో రాళ్లు, మద్యపానం – ధూమపానం, ఊబకాయం కూడా సి.కె.డి. ప్రమాదాన్ని మరింత అధికం చేస్తాయి. సి.కె.డి. నెమ్మదిగా కబళించే వ్యాధి. దీనిలో మూత్రపిండాలకు జరిగే నష్టం తీవ్రమైనది. శాశ్వతమైనది. సి.కె.డి వల్ల కొద్ది నెలల నుంచి సంవత్సరాల కాలంలో  నెఫ్రాన్లకు నెమ్మదిగా నష్టం జరుగుతూంటుంది. .సి.కె.డి.లో అధికరక్తపోటు, చాతీలో నొప్పి, తలనొప్పి, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, అకారణం అనిపించే అలసట, కడుపులో వికారం – వాంతులు, వీపు దిగువభాగాన నొప్పి, చర్మంపై దురదలు, ఏకాగ్రత లోపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా వ్యాధి ముదిరిన స్థితిలో మాత్రమే వ్యక్తం అవుతాయి. చాలా సందర్భాలో వ్యాధిగ్రస్థులను కాపాడటానికి అవకాశం లేని దశలో ఇవి వెల్లడి అవుతుంటాయి.

అత్యధిక సందర్భాలలో బాగా ముదిరిపోయిన స్థితిలోనే సి.కె.డి. గుర్తింపు జరుగుతోంది. ప్రారంభంలో వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించవు. నెఫ్రాన్లలో అధిక శాతం పూర్తిగా నష్టపడి వ్యాధి ముదిరిన తరువాతనే తెలుస్తుంది. అందువల్లనే సి.కె.డి. ని సైలెంట్ కిల్లర్ అంటున్నారు. దేశంలో ఆరోగ్యంగా కనిపిస్తున్న ప్రతీ 5 నుంచి పది మందిలో ఒకరు ఇంకా బయటపడని సి.కె.డి. బాధితులేనని అంచనా.ఆ దశలో చికిత్సకు ద్వారాలు దాదాపు పూర్తిగా మూసుకుపోతాయి. ప్రారంభదశలో గుర్తించినట్లయితే వ్యాధి మరింతగా విస్తరించకుండా చర్యలు తీసుకోవటానికి వీలవుతుంది.

Consult Our Experts Now

డయాలసిస్:

ఇక మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని స్థితిలో మిగిలిన అవకాశాలు రెండే. డయాలసిస్ చేస్తుండటం. అయితే ఇది మూత్రపిండాల వ్యాధులను నివారించే చికిత్స ఎంతమాత్రం కాదు. తాత్కాలికంగా మూత్రపిండాల బాధ్యతను స్వకరించి శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోకుండా ఇది మరోప్రత్యామ్నాయం(మూత్రపిండాల మార్పిడి) లభించే దాకా ఆధారపడగల ఏర్పాటుగా పనిచేస్తుంది.  డయాలసిస్ చేయటంలో ఇబ్బందులు ఎదురయినపుడు, శాశ్వత పరిష్కారంగా మూత్రపిండాల మార్పిడిని సూచిస్తారు. ఇందుకు రోగి కుటుంబ సభ్యులు, బంధువులెవరైనా తమ మూత్రపిండాలలో ఒకదానిని దానం చేయటమో లేక బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి(రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని జీవన్ దాన్ సంస్థ సాయంతో) సేకరించిన మూత్రపిండాన్ని అమర్చటమో చేస్తారు.

మూత్రపిండాల మార్పిడి :

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషనుకు దాత అవసరం. దాత నుంచి కిడ్నీని పొందటానికి జీవన్ దాన్ పథకంలో పేరు నమోదుచేసుకుని ఎదురు చూడవలసి ఉంటుంది.  అందువల్ల  దాత లభించేలోగా డయాలసిస్ పైన ఆధారడటమే మార్గం. దీనిలో రక్తంలోని మలినాలు, అదనపు నీటిని తొలగించివేస్తారు. డయాలసిస్ లో రెండు రకాలు అందుబాటులో ఉన్నయి. ఒకటి హిమోడాయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. హిమోడయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లవలసిసి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ ఇంటిదగ్గరే చేసుకోవటానికి వీలవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలలో లాగానే మన దేశంలోనూ దాతల సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది. అందువల్ల వ్యాధిగ్రస్థుడి పరిస్థతిని బట్టి తొందరగా కిడ్నీ మార్పిడి సర్జరీ అవసరం అయినపుడు కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకులలో ఎవరైనా దానం చేయవచ్చు. దాతల ఆరోగ్యం, రక్తం గ్రూపు తదితర అంశాలను పరిశీలించి డాక్టర్లు సరైన వ్యక్తిని ఎంపికచేస్తారు.

కిడ్నీ వ్యాధుల చికిత్సతోపాటు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించి అత్యాధునిక చికిత్సా పద్దతులలో అనుభవం గల నెఫ్రాలజీ – కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ వైద్యనిపుణులలతోపాటు ప్రపంచ స్థాయి  వైద్య సదుపాయాలు,   హైదరాబాదు నగరంలో  అందుబాటులో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఈ సర్జరీలలో తొంబై అయిదు శాతానికి పైగా విజవంతం అవుతూ అనేక మందికి అదనపు ఆయుర్దాయాన్ని అందిస్తున్నాయి. పది-పదిహేను సంవత్సరాల వరకూ ఎటుంటి సమస్యలు ఎదురుకాకుండా జాగ్రతలు తీసుకోవటానికి వీలవుతుంది.

Consult Our Experts Now

 

About Author –

Dr. Sashi Kiran A, Consultant Nephrologist, Yashoda Hospital, Hyderabad
MD (Pediatrics), DM (Nephrology)

About Author

Yashoda Doctors

Dr. Sashi Kiran A

MD (Pediatrics), DM (Nephrology)

Consultant Nephrologist